శ్రీకృష్ణలీలలు !


శ్రీకృష్ణలీలలు !

బాల కృష్ణుడిని ఎలాగైనా దొంగతనం చేయకుండా ఆపాలని ఒక గోపిక చాలా ఎత్తులో వెన్న పెట్టిన కుండలు పెట్టింది. వచ్చినా కనుగొనాలని ఆ కుండలకు గంటలు కట్టింది. తన పనులు చూసుకోసాగింది. కృష్ణుడు రానే వచ్చాడు. అంత ఎత్తులో ఉన్న కుండలను చూసాడు. రోల్లు, గిన్నెలు బోర్లించి పైకి ఎక్కాడు. కట్టబడి ఉన్న గంటలను చూసి మోగవద్దని వాటిని ఆదేశించాడు. అప్పుడు వెన్నను తీసుకొని మొదట స్నేహితులకు పెట్టాడు. గంటలు కృష్ణుడు ఆజ్ఞ ప్రకారం మోగలేదు. అందరికి ఇచ్చిన తర్వాత తను కొద్దిగా తీసుకొని నోటిలో పెట్టుకున్నాడో లేదో గంటలు మ్రోగాయి. శ్రీకృష్ణుడు వెంటనే “మోగవద్దని చెప్పాను గదా! మళ్ళీ ఎందుకు మ్రోగారు?” అని అడిగాడు. అప్పుడు ఆ గంటలు చెప్పాయి ” ఏం చెప్పము స్వామీ ! తరతరాలుగా దేవుడికి నైవేద్యం పెట్టేప్పుడు గంటలను మ్రోగిస్తారు కదా. అందుకే నీవు నోటిలో పెట్టుకొనేప్పుడు మ్రోగాము” అన్నాయి. శ్రీకృష్ణుడు నవ్వుతూ అక్కడి నుండి జారుకొన్నాడు.

వాల్మీకి మహర్షి తీర్పు — 4


వాల్మీకి మహర్షి తీర్పు — 4

నహ్యస్మాభిః ప్రతిగ్రాహ్యం సఖే! దేయం తు సర్వదా । ఇతి తేన వయం రాజన్ అనునీతా మహాత్మనా ॥

— శ్రీమద్రామాయణే అయోధ్యాకాణ్డే సప్తాతీతిశమస్సర్గః (౧౬వ శ్లోకము)

గుహుడు భరతునితో శ్రీరాముని సత్యపరాక్రమము, ధర్మనిరతిని, శ్లాఘిస్తూ అతడు భక్షభోజ్యాలు సమర్పించినప్పుడు, వాటిని అతి సున్నితముతా నిరాకరిస్తూ శ్రీరాముడు పలికిన ధర్మోక్తులను ఈ శ్లోకము ద్వారా చెప్పెను:

“ మహాత్ముడైన శ్రీరాముడు నన్ను ఈ క్రింది అనునయ వాక్యాలతో బుజ్జగించెను: ’ఓ ప్రియసఖా! మావంటి క్షత్రియులు ఎప్పుడూ (ప్రజలకు) ఇవ్వవలెనే కానీ, ఎన్నడూ (ప్రజలనుండి) పుచ్చుకోకూడదు’.”

మనము నేర్వవలసిన నీతులు:

క్షత్రియులు ఎప్పుడూ అర్హులైన అర్థులకు వారి కామ్యములను ఇవ్వవలెనే కానీ, ఎన్నడూ ప్రత్యుపకారము కానీ, ఇతర ఏ కామ్యములను కానీ, ప్రజలనుండీ స్వీకరించరాదు (ప్రభుత్వమునుకు నడుపుటకై ౧/౬ భాగము మించకుండా స్వీకరించవచ్చు). ఇట్టి ధర్మాలు దృఢముగా పాటించినారు కనుకనే భారతీయరాజులు చిరస్మరణీయులైనారు.
శ్రీరాముని సూక్ష్మబుద్ధి, ధర్మనిరతి, బాగుగా వ్యక్తమగుతున్నది. ఒకవైపు స్నేహధర్మం ప్రకారము గుహుడిచ్చినది స్వీకరింపవలెను. మరొకపక్క రాజధర్మము ప్రకారము స్వీకరించరాదు. ఇట్టి పరస్పర విరుద్ధ సన్నివేశములో విశేషధర్మమైన రాజధర్మమును పాటించి, సామాన్య ధర్మమైన స్నేహమును విడిచిపెట్టెను.
నిరాకరించవలసివచ్చినా, ప్రమతో సమర్పించిన గుహుని మనస్సు నొప్పించకుండా, శ్రీరాముడు మధుర వచనములతో ఆతని బుజ్జగించెను. మనముకూడా ఇట్టి ప్రియభాషణములనే చేయవలెను.

శివధనుర్భంగము


శివధనుర్భంగము
శ్రీ విశ్వనాధ వారి కల్పవృక్షములో శివధనుర్భంగము
పెద్దకళ్ళేపల్లిలో శ్రీమద్రామయణకల్పవృక్షము పై ఒక సాహిత్య సభలో శ్రీ విశ్వనాధవారిని ఒక సభికుడు “స్వామి శివధనుర్భంగము మీద అంత పెద్ద సమాసాలతో పద్యం కాకుండా మావంటి వారికి కుడా అర్ధమయ్యేరీతిలో చిన్న పద్యం వ్రాసుండాల్సింది” అన్నాడుట. అందుకా కవిసామ్రాట్ ” ఏమయ్యా! సైకిల్ మీద స్పీడుగా పోతున్నప్పుడు ట్యూబ్ పగిలిన విషయాన్ని ఇంటికి వచ్చి నీభార్యకి చెప్పుతూంటే, ” స్పీడుగా పోతుంటే “ఢాం” అని ట్యూబ్ పేలింది అని గట్టిగా చెప్తావా? లేదా? మరి శివధనుర్భంగం జరిగినప్పుడు అన్ని లోకాలలో విన్నపడ్డ శబ్దానికైనా శబ్దాలంకారము వాడాలా వద్దా? అనే సరికి ఆ ఆసామి గతుక్కుమన్నాడుట.
ఇంతకీ ఆ ఆసామిని అంత గాభారా పెట్టిన పద్యాలను ఓ సారి తిలకించి, చదువుదాము.
మిత్రులు పిస్కా సత్యనారాయణ గారు ఆంద్రాఫోక్స్ లొ వ్రాసిన వ్యాసములో తాత్పర్య భాగములు
మొదటి పద్యము:
నిష్ఠావర్ష దుదార మేఘపటలీ నిర్గచ్ఛదుద్యోతిత
స్పేష్ఠేరమ్మదమాలికాయుగపదుజ్జృంభన్మహాఘోర బం
హిష్ఠ స్ఫూర్జథుషండ ఘుర్ఘుర రవాహీన క్రియాప్రౌఢి ద్రా
ఘిష్ఠమ్మై యొక రావ మంతట నెసంగెన్ ఛిన్న చాపంబునన్
“ఎడతెగకుండ వర్షించుచున్న అమోఘమైన మేఘముల సమూహము నుండి మిక్కిలిగా వచ్చు మెరుపుతీగలతో పాటు విజృంభించు పిడుగుల సమూహముల యొక్క ఘుర్ఘురధ్వనిని తక్కువ చేయునట్లుగా మిక్కిలి దీర్ఘమైన ఒక రావము ధనుస్సు నుండి వెలువడెను”
రెండవ పద్యము:
హేరంబోన్నత శూర్పకర్ణ వివర హ్రీకారియై, షణ్ముఖ
స్ఫార ద్వాదశనేత్రగోళ వివృతి ప్రాకారమై, శైలక
న్యారాజన్నవ ఫాలమండల విభుగ్నక్రీడమై, ఆశ్చల
ద్గీరుగ్ర ప్రమథంబుగా ధనువు మ్రోగెన్ శైవలోకంబులన్
ఆ వింటిధ్వని వినాయకుని చేటలవంటి చెవితొఱ్ఱలకు సిగ్గును కలిగించినదట! గణేశుడు గజముఖుడు కదా! అందుకే ఆయనవి శూర్పకర్ణములు, అనగా చేటలవంటి విశాలమైన వీనులు! అటువంటి విశాల కర్ణములకే ఆ నాదము శ్రవణభీకరంగా ఉన్నదంటే, ఇక మామూలు మానవులకు ఎలా ఉండివుంటుంది!!…. ఇంకా ఏమంటున్నారో చూడండి. షణ్ముఖుడైన కుమారస్వామి విస్మయముతో తన 12 నేత్రములను విప్పార్చి చూచునట్లుగా చేసినదట ఆ రావము! కుమారస్వామి 6 శిరస్సులను కలిగినవాడు, అనగా 12 నయనములు! ఇకపోతే, గిరిరాజసుతయైన పార్వతీదేవి సైతం ఆ భయంకర నాదాన్ని విని, అప్రయత్నంగానే తన భ్రుకుటిని ముడివేసినదట! ఆమె అందమైన లలాటఫలకం ఆశ్చర్యముతో ముడివడిపోయినదట! ఇక, శివపార్వతులను సేవించే ప్రమథగణాలన్నీ ఆ భీకర విస్ఫోటన ధ్వనిని విని భయముతో “ఆఃప్రకట” రావము చేస్తూ అచేతనులు అయినారట!…. ఈవిధంగా “ధనువు మ్రోగెన్ శైవలోకంబులన్”.
శివధనుర్భంగము యొక్క పరిణామము కైలాసములో, కైలాసవాసులలో ఏ రకంగా ప్రతిఫలించినదో విశ్వనాథవారు ఈ పద్యములో ఎంతో హృద్యంగా వర్ణించారు. అది శివుని ధనుస్సు కాబట్టి, శివలోకమైన కైలాసములో కలిగిన అల్లకల్లోలమును వారు మన కళ్ళకు కట్టారు.

వాల్మీకి రామాయణం శ్రీరాముని పట్టాభిషేకంతో ముగిసింది.


వాల్మీకి రామాయణం శ్రీరాముని పట్టాభిషేకంతో ముగిసింది.
అందరికీ బాగా తెలుసున్న వాల్మీకి రామాయణ గాధ రాముడి జననం , సీతాకళ్యాణం తో మొదలై రాముడి అరణ్యవాసం , సీతాప హరణం, రావణ సమ్హారానంతరం శ్రీ రామ పట్టాభిషేకంతో ముగుస్తుంది. ఆ తరువాత కథ చాలా మందికి తెలిసేంతలా ప్రాచుర్యం కాలేదు. దానికి కారణం రామాయణం విషాదాంతం కావడమేమోనని పండితులు అంటుంటారు.
రామాయణం రెండు భాగాలుగా ఉంది. శ్రీరామ జననం నుంచి పట్టాభిషేకం వరకు మొదటి భాగం. శ్రీ రామ పట్టాభిషేకం నుంచి నుంచి శ్రీ రామ నిర్యాణం వరకు రెండవ భాగం. ఈ రెండవ భాగాన్నే ఉత్తర రామాయణం అంటారు. ఈ ఉత్తర రామాయణాన్ని భవభూతి సంస్కృతంలో రాసాడు. ఆయన ఒక చోట కరుణ రసం ఒక్కటే రసం అని చెప్పాడు.
శ్లోకం. ఏకో రస కరుణ ఏవ నివర్తి ఖేదా
భిన్న పృథగ్ పృథగి వాశ్రయతే వివర్తా
ఆవర్త బుద్బుద తరంగ మాయాన్ వికారాస్
అంభో యధా సలిల మే వహి తత్సమస్తం
కరుణకు భావస్థాయి శ్లోకం. ఎందుకంటే వాల్మీకి మొదటి శ్లోకం (” మాన్నిషాద” ) కరుణ నుంచే ఉద్భవించింది. దాశరధీ కరుణా పయోనిధీ అని జనులు రాముడ్ని ప్రార్ధించడం అందుకే. ఈ ఉత్తర రామాయణంలో సీతా రాముల వియోగం, నిర్యాణం కారణంగా కరుణ రసం పతాక స్థాయిలో ఉంది. తిక్కన సోమయాజి నిర్వచనోత్తమ రామాయణం ( వచనం లేని , కేవలం పద్యకావ్యం) రచించాడు. తరువాత కంకంటి పాపరాజు ఉత్తర రామాయణాన్ని చంపూ కావ్యంగా రాసాడు. ” జానకీఈ జాని కథల్ రచింపక యసత్కథలెన్ని రచించెనేనియున్ … వాని కవిత్వ మహత్త్వమేటికిన్?” అన్నాడు పాపరాజు. నిజంగానే కవి అనేవాడు రాముడి మాట తలవకుండా ఉండలేడు. అంత శక్తి ఆకర్షణా ఉన్నవాడు రాముడు.
1990 లో శ్రీ వేమూరి వెంకటేశ్వర శర్మ గారు “ఉత్తర రామాయణ కధలు ” ఇప్పుడు అది అలభ్యగా గోచరిస్తున్నది.
కాని మిత్రులెవరో దానిని ఈ శృంఖలలో భద్రపరిచారు. ఉత్తర రామాయణం లోని కధలు చదవాలనుకున్న వారికి ఇది ఉపయోగపడ గలదు.

https://archive.org/details/uttararamayanaka024864mbp

నేను పై వ్రాసిన వ్యాక్యాలు ఈ పుస్తకానికి ఆచార్య తిరుమల గారు వ్రాసిన “అద్దంలో అవనీధరం” అనే ముందుమాట లోనివి

శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి ( చందవోలు శాస్త్రి ) గారి అనుభవ విశేషాలు


శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి ( చందవోలు శాస్త్రి ) గారి అనుభవ విశేషాలు

ఒకసారి నేను శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిని సందర్శించినప్పుడు, మా తండ్రిగారు వ్రాసిన పుస్తకాల సెట్టు ఒకటి తనకివ్వమని అడిగారు.
” తమకు నాగరలిపి వచ్చు. అరవ లిపి వచ్చు. మరి తెలుగు లిపి పరిచయమేనా ?” అని నేను అడిగాను.
” నాకు అక్షరాలు వస్తేనేమి, రాకపోతేనేమి? పుస్తకాలు పెట్టి పూజ చేస్తాను. ఒక సెట్టు ఇవ్వు” అన్నారు శ్రీవారు.
తరువాత కొంతకాలానికి నేను హైదరాబాద్ వచ్చాను. అప్పుడు స్వామివారు కౌతా లలితా మనోహర్ ఇంట్లో ఉన్నారు. నేను శ్రీవారి దర్శనానికి వెళ్ళాను. అక్కడ పరిచారకుడు నేను వచ్చినట్లు స్వామికి తెలిపాడు. దొడ్లో గోశాలలో గోవుల మధ్య కూర్చుని ఉన్న శ్రీవారు నాకు కబురు పెట్టారు. నేను రాగానే శ్రీవారు పక్కనే ఉన్న ఒక పాడు బడ్డ కొంపలోకి వచ్చారు.
అదే సమయానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల్లో మంత్రి పదవులు నిర్వహించిన శ్రీ పి.వి. నరసింహారావు గారు కూడా శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఆయన శ్రీవారి పై కొన్ని సంస్కృత శ్లోకాలు వ్రాసుకుని వచ్చారు. శ్రీవారి ఎదుట కూర్చుని ఆయన తన శ్లోకాలు వినిపించారు.
శ్రీవారు ఆ శ్లోకాలలో తప్పులు దిద్ది కొన్ని సూచనలు చేశారు.
నా శ్లోకాలలో తప్పులేవి శ్రీవారు ఎత్తిచూపలేదు. కాని, నా కవిత్వంలో రెండు చోట్ల తప్పులు దొర్లినవని శ్రీ నరసింహారావు గారు అన్నారు. అప్పుడే శ్రీవారు ” దేశంలో గొప్ప పదవి అలంకరించబోయే వ్యక్తి తప్పులు చేయరాదు” అని ఏదో సూచన ప్రాయంగా భవితను చెప్పారు.
నన్నుద్దేశ్యించి, ” కవిత్వంలో, జన్మలో, నడవడిలో ఆయనకు తప్పు అనేది ఉండదు” అని శ్రీవారన్నారు. ఆ పిమ్మట శ్రీవారిపై నేను ఆశువుగా చెప్పిన శ్లోకాలు మళ్ళా చదవమని చెప్పి, ఒక గంటసేపు పురాణం చేశారు శ్రీవారు. తరువాత స్వామి వారు ఈ క్రింది పద్యం చదివారు.
కనుమీ నీ నగుమోము మేల్సిరికి లక్ష్యం బౌటకున్ ల జ్జెనెట్టగ మున్మున్న మునింగి కొండచరిబాటం జారె రేరేడటం చనుమోదించుట బద్మినీపతి నిజుస్య స్మేర దృష్టి ప్రసా ర నవోల్లాసిత హ్రీణయై తెలిపెడిన్, రామా! జగన్మోహనా!!
ఇది మా తండ్రిగారు వ్రాసిన ” రామ కధామృతము” లో బాలకాండ, నవమాశ్వాసములోనిది. విశ్వామిత్రుడు శ్రీరాముని నిద్రలేపు సందర్భం.
శ్రీవారు పై పద్యం చదివి, ” మీ నాన్నగారు దోవనబోతూ ఎప్పుడూ ఈ పద్యం చదువుతూ ఉండేవారు కదూ ? ” అని నన్ను అడిగారు.
ఏనాడో గతించిన మా తండ్రిగారు తన పద్యాన్ని ఎంత ఆర్తిగా చదివే వారో అలాగే స్వామి వారు ఎట్లా చదవగలిగారు !
శ్రీవారు ఇప్పటి వారు కారు. వెనక ఆర్షయుగంలో వశిష్టాదుల కోవకు చెందిన వారు.

అనాచారం – ఆత్మహత్య

నేడు లోకంలో చూస్తున్న అనాచారాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే, కృష్ణలోనో, గోదావరి లోనో దూకి చచ్చిపోదామనే తలపు ఇటీవల అనేక పర్యాయాలు కలిగింది నాకు.

ఒకసారి అరుగు మీద కూర్చోని ఇదే ఆలోచిస్తూ ఉంటే తలుపు కెదురుగా శ్రీవారి రూపం నవ్వుతూ నాకు కనిపించింది. అయితే, శ్రీవారు నేల మీద పాదాలు మోపకుండా కాస్తంత పైన ఉన్నట్లున్నది ఆ రూపం.

చచ్చిపోదామనే ఆలోచన వచ్చినప్పుడల్లా వరసగ రెండు రోజులు శ్రీవారి దర్శనం ఇలా జరిగేది. అప్పుడు నాకు విసుగు పుట్టింది.

నేను చచ్చిపోవడం బహుశా శ్రీవారికి ఇష్టం లేదు కాబోలు అనుకుని, నా ఆత్మహత్య ఆలోచనకు స్వస్తి చెప్పుకున్నాను. ఆ పిమ్మట శ్రీవారి రూపం కనబడడం మానేసింది.

ఐదారు నెలల తరువాత ఒకసారి మళ్ళా హైదరాబాదు వచ్చాను. తీర్ధయాత్రలకు వెళ్ళాలంటేనే ఇక్కడకు వస్తాను. లేకపోతే రాను. శ్రీ వేంకటేశ్వర స్వామి దగ్గరకు వెళ్ళినా శ్రీవారి వద్దకు వెళ్ళినా తీర్ధయాత్రే నాకు.

ఒకరోజు శ్రీ పి.వెంకటేశ్వర్లుతో ( శ్రీ పిరాట్ల వారు) కలిసి శ్రీవారి దర్శనానికి వెళ్ళాను. “చందోలు శాస్త్రిగారు” వచ్చారని ఆయన శ్రీవారితో చెప్పారు.

నన్నుద్దేశ్యించి శ్రీవారు ” నీ సమస్య ఏమయింది?” అన్నారు.

నేను ” ఏం సమస్య? ”

శ్రీవారు : ” అనాచారం కోసం చావడం ”

నేను : ” వద్దు అని మీరన్నారు కదా ! అందుకని చాలించుకున్నాను”.

అటు తరువాత ప్రాయశ్చిత్తాన్ని గురించి ముచ్చటించుకున్నాము నేను శ్రీవారు.

ప్రాయశ్చిత్త గ్రంధం ఎందుకు పుట్టింది అనేది ఒక ప్రశ్న. తప్పుచేస్తే దిద్దుకునేందుకుగాను ప్రాయశ్చిత్తం ఉద్దేశించారు. తప్పు ఒకసారి చేస్తే ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు.

స్వామివారు : ” అహం బ్రహ్మస్మి అనుకోరాదా? అనాచార భావం బాధించకుండా వుండేందుకుగాను.”

నేను: ఆ స్థితి ఇంకా రాలేదు కదా నాకు

స్వామివారు: క్షణిక సమాధి సంగతి?

నేను: మీ అనుగ్రహం వుంటే వస్తుంది

ఆ తరువాత పక్కన ఒకాయన శ్రీవారికి వింజామర వీస్తుంటే దాన్ని తీసుకుని కొద్దిసేపు వీచాను. ఒక పరిచారకుని ద్వారా శ్రీవారు ఒక శాలువా తెప్పించి, స్వయంగా వారే నాకు దాన్ని కప్పారు.

నేను: మీరు ఎవరిని తాకరు. మీరే ఒక కొత్త ఆవరణ నాకు కప్పుతున్నారు.

స్వామివారు : నీకు కాదు కప్పేది. నీ మీదకు వచ్చే అనాచారానికి కప్పుతున్నాను.

శ్రీవారికి నాతో పనిలేదు. నాకు శ్రీవారితో పనిలేదు. కాని కాసేపు వారితో ఉంటే సంగంలోనిస్సంగత్వం అలవాటు చేస్తారు శ్రీవారు. ఆయన మహానుభావులు.

” ఆయన ఋషి”

ప్రసంగవశాత్తు శ్రీ రాఘవనారాయణ శాస్త్రి గారు తన తండ్రి కీర్తిశేషులు తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రులు గారిని గురించి ఒక చిన్న ఉదంతం ఇలా చెప్పారు.

” మా నాన్నగారు “త్రిశంకు స్వర్గం” అని పేరుగల ఏడంకాల నాటకం వ్రాశారు. దానిని నూజివీడు జమీందారు గారికి చదివి వినిపించారు. చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి గారు తాను వ్రాసిన “విశ్వామిత్ర – మేనక” అనే మూడంకాల నాటకం చదివారు. కవిత్వం గురించి చర్చ జరిగింది.

” ప్రపంచంలో మొదటి తరగతి కవిత్వం ఎవరిది? అని అడిగారు జమీందారు గారు.

” నా గొంతులో ప్రాణం ఉండగా మరొకరి కవిత్వం గొప్పదని నేను ఎలా ఒప్పుకోను?” అన్నారు చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారు.

“మరి చందవోలు శాస్త్రిగారో ?” అని అడిగారు జమీందారు గారు

” ఆయన ఋషి” అన్నారు చెళ్ళపిళ్ళవారు.

( ఈ వ్యాసము 13-5-90 ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధములో ప్రచురితమైనది )

వాల్మీకి మహర్షి తీర్పు – 3


వాల్మీకి మహర్షి తీర్పు – 3

ఆసనం పూజయామాస రామాయాభి ప్రణమ్య చ । వాలవ్యజనమాదాయ న్యషీదత్ సచివాసనే ॥
శ్రీమద్రామాయణే అయోధ్యాకాణ్డే ఏకనవతితమస్సర్గః (౩౮వ శ్లోకము)

భరధ్వాజముని తన తపశ్శక్తితో విశ్వకర్మని ఆహ్వానించి, భరతుడు మరియు అతని పరివారము ఆ రాత్రికి విడిదిచేయుటకు, ఒక అలౌకికమైన దివ్య భవనమును సృష్టించెను. అప్పుడు ఆ భవనములో ప్రవేశించిన భరతుడు “సభలోనున్న ఉత్కృష్టమైన సింహాసనముపై శ్రీరాముడు విరాజమానమై ఉన్నట్టు భావించి, దానిని పూజించి, నమస్కరించెను. తరువాత, ఒక సచివుడు కూర్చునే ఆసనముపై తాను కూర్చొనెను.”

మనము నేర్వవలసిన నీతులు:
ఒక ఇంట్లో అన్నిటికన్నా శేష్ఠమైన ప్రదేశములో, శ్రేష్ఠమైన ఆసనముపై భగవంతుని ఆహ్వానించి పూజించాలి.
భవవంతునికన్నా పెద్ద, ఉన్నత ఆసపై ఎన్నడూ కూర్చుండరాదు.
అట్లే పెద్దలైన వారికి ఉన్నతాసనము వదిలి, పిన్నలు ఉచితాసనములపై కూర్చొనాలి. ఎవరి అర్హతకు తగ్గ ఆసనమును వారికి ఇవ్వాలి.
ఏ పని చేసినా భగవంతుని స్మృతిపథములో ఉంచుకొనే భరతుని కర్మయోగమునకు జేజేలు.

వాల్మీకి మహర్షి తీర్పు — 2


వాల్మీకి మహర్షి తీర్పు — 2

తతస్తు జలశేషేణ లక్షణోప్యకరోత్ తదా । వాగ్యతాస్తే త్రయః సన్ధ్యాం సముపాసత సంహితాః ॥
— శ్రీమద్రామాయణే అయోధ్యాకాణ్డే సప్తాతీతిశమస్సర్గః (౧౮వ శ్లోకము)
“సీతారాములు జలభక్షణము చేసిన (కేవలము నీళ్లుత్రాగి కడుపునింపుకునిన) ఆ మిగిలిన నీటిని (ప్రసాదముగా) లక్షణుడు స్వీకరించెను. వారు ముగ్గురూ జలభక్షణమునకు ముందే సకాలములో, ఏకాగ్రచిత్తముతో సంధ్యోపాసనము చేసిరి”, అని గుహుడు భరతునకు చెప్పెను.
మనకు నీతులు ఇవి:
లక్ష్మణునిివలె మనముకూడా ఎప్పుడూ భవవంతునికి నేవేదనము చేసి, ఆ శేషభాగమునే భుజించవలెను. అట్లు చేయని ఆహారము, అపరిశుభ్రము, హీనము, హింసాభరితమగును.
సకాలములో సంధ్యావందనము చేయుట యొక్క ప్రాముఖ్యత మరొక్కమారు ఇక్కడ సీతారామలక్ష్మణులు మనకు చూపుతున్నారు. ఎవరి సంస్కారమును బట్టి, వారికి మన ఋషులు సంధ్యోపాసన విధిని సూచించిరి. దాని ప్రకారము, కుల, లింగ, న్యాయముల అనుసరించి సంధ్యావందనము చేయవలసినదే.

వాల్మీకి మహర్షి తీర్పు – 1


వాల్మీకి మహర్షి తీర్పు — మనం — పుణ్యక్షేత్రాలలో సౌకార్యాలు
బలం సర్వమవస్థాప్య జగామ సహ మన్త్రిభిః ॥ పద్భ్యామేవ హి ధర్మజ్ఞో న్యస్తశస్త్ర పరిచ్ఛదః ।
శ్రీమద్రామాయణే అయోధ్యాకాణ్డే నవతితమస్సర్గః (౧-౨ శ్లోకములు)
ధర్మజ్ఞుడైన భరతుడు, భారద్వాజాశ్రమానికి క్రోసెడు దూరములోనే సేనలని
నిలిపివేసి, శస్త్రాస్త్రాలను, ఆభరణాదులను, విడిచి, ముఖ్యమైన మంత్రులతో కలిసి
కాలినడకన ముని సందర్శనముకై వెళ్ళెనని ఈ శ్లోకపుభావము.
పుణ్యతీర్థాలు, పుణ్యక్షేత్రాలు, వెళ్ళేటప్పుడు మన అహంకారాదులను,
ఆడంబరాలను, పూర్తిగావిడిచి పెట్టి, దైన్యభావనుతో నుండాలని భరతుని
సందేశము. అట్ట్లు చేయక ఆ క్షేత్రాలలో కూడా మన సౌకర్యముకై ప్రాకులాడుట
అధర్మమని వాల్మీకిమహర్షి తీర్పు.

అష్టాక్షరీ మహామంత్ర విశిష్టత అర్థం


“ఒమ్ నమో నారాయణాయ” అనే అష్టాక్షరీ మంత్రంలో “ఒమ్” – ఆత్మ స్వరూపాన్ని, “నమః” – అనే అక్షరాలు – బుద్ధిని, మనస్సుని, “నారాయణాయ” – అనే అక్షరాలు పంచేంద్రియాలను “జీవుని” తెలియజేస్తున్నాయి.

అష్టాక్షరీ మంత్రం ‘వ్యాపక మంత్రం’. ఆకాశతత్త్వంపై ఆధారపడి ఉంది. ఆ కారణంగా ఈ మంత్రాన్ని జపించేతప్పుడు, ఉపాసకుని మనస్సంతా ఈ మంత్రమే వ్యాపించి ఏకాగ్రతను కలిగిస్తుంది.

జలాలకు నారములని పేరు. పరమాత్మ ఆ ‘అనంతజలరాశి’లో శయనిస్తాడు కనుక ఆయనకు ‘నారాయణ’ అనే నామం వచ్చింది. ఇంకా,

“న” కార పదోచ్చారణ మాత్రేనైవ నాకాధిప భోగం లభతే
“ర” కార పదోచ్ఛారణేవ రామరాజ్య భోగం లభతే
“య” కార పదోచ్ఛారణేవ కుబేరవత్ ప్రకాశతే
“ణ” కార పదోచ్చారణేవ వైరాగ్యం లభతే

“న” అను అక్షరాన్ని ఉచ్చరించటం చేత ఇంద్ర భోగాలు లభిస్తాయి. “ర” అనే అక్షరాన్ని ఉచ్చరించటం చేత రామరాజ్యంలోనున్న భోగాలు లభిస్తాయి. “య” అను అక్షరాన్ని ఉచ్చరించటం చేత కుబేరునివలె సర్వసంపదలతో ప్రకాశిస్తారు. “ణ” అను అక్షరాన్ని ఉచ్చరించటం చేత ఐహిక సుఖాల పట్ల విముఖత కల్గి, దైవచింతన పట్ల ఆసక్తి కల్గి, మోక్షాన్ని పొందేందుకై మార్గం లభిస్తుంది. ఇంతటి శక్తివంతమైన “నారాయణ” అను శబ్దానికి ‘ఒమ్ నమో నారాయణాయ’ (అష్టాక్షరీ మహా మంత్రం)ను జపించాతంచే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవచ్చు. ఈ మహా మంత్రంలో, మహోన్నతమైన శక్తి ఉంది.

ధ్యాయేన్నారాయణందేవం
స్నానాదిఘ చ కర్మసు,
ప్రాయశ్చిత్తం హి సర్వస్వ
దుష్కృత…

V