ఎక్కడ నేర్చుకున్నావు?
ఇది 1956-57లలో జరిగిన సంఘటన. కంచి పరమాచార్య స్వామి వారు మద్రాసు మైలాపూరులోని సంస్కృత కళాశాలలో మకాం చేస్తున్నారు.
ఒక సాయింత్రం పరమాచార్య స్వామి వారు ఒక పెద్ద సభలో ప్రసంగించవలసి ఉంది. ఆ సభలో రాజాజి లాంటి ప్రముఖులు కూడా ఉన్నారు. స్వామివారు ఏ విషయం గురించి మాట్లాడాలా అని ఆలోచనలో ఉన్నారు. వెంటనే వేదిక పక్కన నిలబడి ఉన్న ప్రొ. శంకరనారాయణ అయ్యర్ ని పిలిచి ఒక సంస్కృత శ్లోకంలో రెండు పాదాలు చెప్పి, మిగిలిన శ్లోకం ఏమైనా గుర్తున్నదా అని అడిగారు. ఆయన తన అజ్ఞానాన్ని మన్నించమని అడిగి తెలియదని చెప్పి వేదిక దిగి వచ్చేసారు.
ఈ సంభాషణ అంతా మైక్ ముందు జరగడం వల్ల సభికులందరికి దీని గురించి తెలిసింది. ఈ వ్యాసం వ్రాసిన డా. సి.ఆర్. స్వామినాథన్ కూడా ఆ శ్లోకం పాదాలు విన్నారు. ఆయనకు ఈ శ్లోకం పూర్తిగా వచ్చు కాబట్టి, వెంటనే శంకరనారాయణ అయ్యర్ దగ్గరికి వెళ్ళి మిగిలిన రెండు పాదాలు చెప్పారు.
అయ్యర్ గారు మరలా వేదికపైకి వెళ్ళి మహాస్వామి వారి ముందు ఆ శ్లోకాన్ని చెప్పారు.
స్వామివారు ఆయనతో, “నీకు ఈ శ్లోకం తెలియదన్నావు. మరి ఇప్పుడు ఎలా చెప్పగలుగుతున్నవు?” అని అడిగారు.
“సభికులలో ఒకరు గుర్తుతెచ్చుకుని నాకు చెప్పారు పెరియవ” అని బదులిచ్చారు.
మహాస్వామివారు అతని గురించిన వివరాలు కనుక్కొని, డా. స్వామినాథన్ ను వేదిక పైకి పిలవాల్సిందిగా అయ్యర్ గారికి చెప్పారు. ఆయన వేదిక పైకి రాగానే, అతని పేరు, వృత్తి మొదలైన వివరములు అడిగి, “ఎక్కడ చదివావు?” అని అడిగారు.
అతని విద్యా సంబంధమైన విషయములు అడుగుతున్నారు అనుకుని స్వామినాథన్ మద్రాసు ప్రెసిడెన్సి కాలేజిలో అని చెప్పారు. అందుకు స్వామివారు ”అది కాదు. ఈ శ్లోకం ఎక్కడ నేర్చుకున్నావు?” అని అడిగారు.
తన చిన్నతనంలో తన తాత వద్ద ఈ శ్లోకం నేర్చుకున్నానని స్వామినాథన్ బదులిచ్చారు. మహాస్వామి వారు స్వామినాథన్ స్వస్థలం, వారి తాతగారి పేరు, వారి కుటుంబ వివరాలు అన్నీ అడిగి తెలుసుకున్నారు. ఈ మొత్తం సంభాషణ అంతా మైకు ముందు జరగడం వల్ల అక్కడున్నవారు మొత్తం విన్నారు. ఆ శ్లోకం ఇదే:
అర్థాతురాణాం న గురుర్ న బంధుః
క్షుధాతురాణాం న రుచికి న పక్వం
విద్యాతురాణాం న సుఖం న నిద్ర
కామాతురాణాం న భయం న లజ్జ
ధనార్జన చేయువానికి గురువులు, బంధువులు అన్నది ఉండదు. ఆకలిగొన్నవాడికి రుచి, పక్వం పట్టింపు ఉండదు. నేర్చుకోవాలి(చదువుకోవాలి) అన్న ధృతి ఉన్నవాడికి నిద్ర, సుఖము తెలియదు. కోరికలతో సతమతమయ్యేవాడికి భయము, సిగ్గు ఉండవు.
తరువాత పరమాచార్య స్వామివారి అనుగ్రహ భాషణంలో కేనోపనిషత్తు గురించి చెబుతూ, పార్వతీ దేవి గురు స్వరూపిణియై దేవతలకు పరబ్రహ్మం గురించి ఎలా విశదపరచిందో చెప్పారు. ఉపన్యాసం ముగిస్తూ చివర్లో ఇలా అన్నారు.
”ఉపన్యాసం మొదలుపెట్టక ముందు ఒక వ్యక్తిని వేదికపైకి పిలిచి నేను సగం చెప్పిన ఈ సుభాషితాన్ని ఎక్కడ నేర్చుకున్నావు అని అడిగాను. అతను ఎవరో నాకు తెలుసు. కాని ఎందుకు పిలిచి మరీ అడిగాను అంటే ఇక్కడున్న మీకందరికి తెలియాలి అది ఏదో పాఠశాలలోనో, కళాశాలలోనో నేర్చుకున్నది కాదు. బాల్యంలో అతని తాత వద్ద నేర్చుకున్నది. పిల్లలకు మంచి విషయాలు, విలువలు ఇంట్లోని పెద్దల ద్వారానే సమకూరుతాయి తప్ప ఆధునిక పాఠశాలలోనో, కళాశాలలోనో కాదు”
ఇంకా స్వామినాథన్ చివరలో ఇలా వ్రాసారు:
నాలాంటి అల్పుడు, సిగ్గు, భయం కలవాడిని కొన్ని వేలమంది సభికులున్న వేదికపైకి పిలిచి పరమాచార్య స్వామివారు అందరికి ఏమి చెప్పలనుకుంటున్నారు అంటే
> పాఠశాల విద్యార్థులకి చదువుతో పాటు సంస్కారము, విలువలు నేర్పడం పెద్దలు(నాన్నమ్మలు తాతయ్యలు) ఉన్న ఒక ఉమ్మడి కుటుంబం వల్ల మాత్రమే సాధ్యం.
> పెద్దలు కూడా వారి విలువైన సమయాన్ని పిల్ల్లకు మంచి విషయాలు మంచి కథలు చెప్తూ గడపవచ్చు.
> ఆ వయసులో నేర్చుకున్న విషయాలు వారి జ్ఞాపకాల పొరలలో పదిలంగా ఉండి వారిని ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి.
— డా. సి.ఆర్. స్వామినాథన్, భారత ప్రభుత్వ మాజీ సహాయ విద్యా సలహాదారు.